అమీర్పేట్, జూన్ 27 : చిరు వ్యాపారులకు తమ వ్యాపారాల నిర్వహణకు నిర్ధిష్టమైన స్థలం ఉండేలా వెండింగ్ జోన్ల ఏర్పాటుకు ప్రభుత్వం పూనుకున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. బల్కంపేట ప్రధాన రహదారిపై రూ.22 లక్షలు, సనత్నగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ పార్కు సమీపంలో రూ. 26 లక్షల వ్యయంతో చేపడుతున్న ఈ స్ట్రీట్ వెండింగ్ జోన్ నిర్మాణ పనులకు ఆదివారం కార్పొరేటర్ కొలను లక్ష్మిరెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వీధి వ్యాపారులకు అనువైన స్థలాలు లేకపోవడం వల్ల దినదిన గండంగా తమ వ్యాపారాలను కొనసాగిస్తున్నారన్నారు.
ఎవరికీ ఇబ్బందులు లేకుండా స్ట్రీట్ వెండింగ్ జోన్ల ఏర్పాటుకు జీహెచ్ఎంసీ క్షేత్ర స్థాయిలో సర్వేలు చేసి స్థలాలను ఎంపిక చేసిందన్నారు. అనంతరం సనత్నగర్ నెహ్రూ పార్కులో జరుగుతున్న థీమ్ పార్కు నిర్మాణ పనులను డిప్యూటీ కమిషనర్ వంశీతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. చిన్నారులకు చక్కటి ప్లే ఏరియా, పెద్దవారికి వాకింగ్ ట్రాక్ వంటి సదుపాయాల నిర్మాణాల్లో ఎటువంటి నాణ్యతాలోపాలు లేకుండా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కొలన్ బాల్రెడ్డి, సురేశ్ గౌడ్, ఝాన్సీరాణి, పెరుమాండ్ల నాగమణి, సమీఉల్లా పాల్గొన్నారు.
అమీర్పేట్ డివిజన్ లీలానగర్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశామని, చుట్టు పక్కల కాలనీలు, బస్తీల్లో ప్రజలకు మెరుగైన వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. లీలానగర్లో రూ.38 లక్షల వ్యయంతో నిర్మించిన కమ్యూనిటీ హాలును కార్పొరేటర్ కేతినేని సరళ, మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారి, కాలనీ వాసులతో కలిసి ప్రారంభించారు.