అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ నాయకులు వరుసగా కొవిడ్ బారిన పడుతున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. తాను హోం ఐసోలేషన్లో ఉన్నట్లు ట్విట్ చేశారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నానని ఆయన పేర్కొన్నారు.
నిన్న టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ఈరోజు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు చంద్రబాబు ట్విట్ చేశారు. తేలికపాటి లక్షణాలు ఉన్నాయని, ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నానని, ఇటీవల తనను కలిసిన వారంతా వీలైన త్వరగా కొవిడ్ పరీక్షలు చేసుకోవాలని బాబు సూచించారు. ఏపీలో కరోనా కేసుల సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. నిన్న ఒక్కరోజే నాలుగువేలకు పైగా కేసులు నమోదు కావడం తీవ్రతను తెలియజేస్తుంది.