అమరావతి : తిరపతి ఉప ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన తనయుడు నారా లోకేశ్ డ్రామాలు ఆడుతున్నారని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు.
ఇటీవల జరిగిన తిరుపతి సభలో రాళ్లు విసిరారంటూ చంద్రబాబు రాళ్ల డ్రామా ఆడితే.. ఇప్పుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ సవాల్ డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో 151 శాసనసభ స్థానాలు గెలిచిన సీఎం జగన్కు సొంత నియోజకవర్గం మంగళగిరిలో ఓడిన లోకేశ్కు పోలిక ఏంటని ఎద్దేవా చేశారు.
ఓడ రేవులపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏమన్నారో తెలుసుకుని స్పందిస్తామని ఆయన అన్నారు.
కాగా తిరుపతి ఉప ఎన్నిక వేళ నేతల సవాళ్లు, ప్రతి సవాళ్లు హీట్ పెంచుతున్నాయి. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ప్రమాణం చేయాలని సవాల్ విసిరిన లోకేశ్ నిన్న అలిపిరి వెళ్లారు.
వివేకా హత్య కేసులో తన కుటుంబానికి ప్రమేయం లేదని ప్రమాణం చేయడానికి అలిపిరికి వచ్చానని.. తన సవాలును స్వీకరించి సీఎం జగన్ అలిపిరికి వస్తారా అని ప్రశ్నించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి