అమరావతి : తిరుపతిలో టీటీడీ నిర్వహిస్తున్న శ్రీవేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల, ఎస్వీ నాదస్వరం, డోలు పాఠశాలలు 2021-22 విద్యా సంవత్సరానికి పలు కోర్సుల్లో ప్రవేశానికి ఆసక్తి గల విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాయి. ఆగస్టు 21వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఎస్వీ సంగీత, నృత్య కళాశాలలో ఫుల్టైమ్ విశారద (డిప్లొమా), ప్రవీణ (అడ్వాన్డ్స్ డిప్లొమా) కోర్సులు, ఎస్వీ నాదస్వరం, డోలు పాఠశాలలో ఫుల్టైమ్ సర్టిఫికేట్, డిప్లొమా కోర్సులు ఉన్నాయి.
అదేవిధంగా, గాత్రం, వీణ, వేణువు, వయోలిన్, మృదంగం, ఘటం, భరతనాట్యం, కూచిపూడి నృత్యం, హరికథ విభాగాల్లో పార్ట్ టైమ్ సర్టిఫికేట్, డిప్లొమా, కళాప్రవేశిక కోర్సులకు ఆగస్టు 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు కళాశాల కార్యాలయ పనివేళల్లో రూ.50 చెల్లించి దరఖాస్తు పొందొచ్చు. రెగ్యులర్ కోర్సులకు 8వ తరగతి, సాయంత్రం కళాశాలకు 5వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇతర వివరాలకు కళాశాల కార్యాలయ పనివేళల్లో 0877-2264597 నంబరులో సంప్రదించాలని అధికారులు సూచించారు.