హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టీకాల పంపిణీ టెండర్లకు సంబంధించి ప్రభుత్వం నేడు ప్రీబిడ్ నిర్వహించనుంది. కొవిడ్ టీకాల కోసం ఈనెల 19 గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది. ఇప్పటికే ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నది. దీనికి సంబంధించి బుధవారం ప్రీబిడ్ నిర్వహించనుంది. సమావేశానికి పలువురు ఉత్పత్తిదారులు పాల్గొననున్నారు. టీకాల పంపిణీపై ఆసక్తి ఉన్న తయారీదారులు తమ సందేహాలు నివృత్తి చేసుకునే అవకాశం.
రాష్ట్రంలో వ్యాక్సిన్ కొరత సమస్యను పరిష్కరించడానికి గ్లోబల్ టెండర్లను ఆహ్వానిస్తూ టీఎస్ఎంఐడీసీ విధివిధానాలను ఈ నెల 19న జారీ చేసింది. కోటి వ్యాక్సిన్ డోసులను రాష్ట్ర ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుందని టెండర్ నియమాల్లో పేర్కొంది. అర్హులైన వారు టీఎస్ఎంఐడీసీ అధికారిక వెబ్సైట్ నుంచి టెండర్ ఫామ్ను డౌన్ లోడ్ చేసుకోవచ్చని ప్రకటనలో వెల్లడించింది. ఆన్లైన్ విధానంలో జరిగే ఈ బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనాలనుకునే వారు తప్పక వారి దరఖాస్తులను ఈ ప్రొక్యూర్మెంట్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
మే 21 నుంచి జూన్ 4 వరకు ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నది. జూన్ 4న సాయంత్రం 6.30 గంటలలోపు దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే టెండర్ ప్రక్రియలో పాల్గొనే అర్హత ఉంటుందని స్పష్టం చేసింది. మొత్తం 180 రోజుల వ్యవధిలో టెండర్లకు ప్రభుత్వం ఆహ్వానం పలికింది. నెలకు కనీసం 15 లక్షల డోసుల చొప్పున 6 నెలల్లో టీకా డోసులు ఇవ్వాలని టెండర్ నియమాల్లో పేర్కొంది.