నర్సంపేట, జూలై 13: మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దామని ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు. జిల్లావ్యాప్తంగా హరితహారం కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతున్నది. ఇంటింటికీ అందించిన మొక్కలను ప్రజలతో నాటిస్తున్నారు. ఇందులో భాగంగా నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్ మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో మొక్కలు నాటించారు. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆమె గుర్తుచేశారు. అడవుల శాతం పెంపునకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. నర్సంపేటను నందనవనంగా మార్చేందుకు అందరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇంటింటికీ పూలు, పండ్లు, ఔషధ మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మునిగాల వెంకట్రెడ్డి, కమిషనర్ విద్యాధర్, కౌన్సిలర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.
సుందరంగా రహదారులు
వర్ధన్నపేట: పట్టణ పరిధిలోని రహదారులను సుందరంగా తయారు చేసేందుకు కృషి చేస్తున్నట్లు వర్ధన్నపేట మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోత్ అరుణ అన్నారు. వర్ధన్నపేట-జఫర్గఢ్ రహదారిలోని డివైడర్ మధ్యలో పాలకమండలి సభ్యులు, మున్సిపల్ కమిషనర్ గొడిశాల రవీందర్తో కలిసి ఆమె మొక్కలు నాటారు. 1.5 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ డివైడర్లో 175 మొక్కలు నాటుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్చైర్మన్ కోమాండ్ల ఎలేందర్రెడ్డి, కౌన్సిలర్లు తోటకూరి రాజమణి, టీ రవీందర్, ఎం రామకృష్ణ పాల్గొన్నారు.
హరితోద్యమంలో భాగస్వాములు కావాలి
దుగ్గొండి: హరితోద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని చలపర్తి సర్పంచ్ ముదరుకోళ్ల శారదాకృష్ణ పిలుపునిచ్చారు. చలపర్తి, జీడికల్ గ్రామాల ప్రజలకు పూలు, పండ్ల మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రేఖంపల్లి ఎంపీటీసీ రంపీస సోనీరతన్, కార్యదర్శి సంతోష్, ఉపసర్పంచ్ భాస్కర్, వీఆర్వో కుమారస్వామి, వార్డు సభ్యులు, కోలా రవీందర్, ఏరుకొండ రజిత, శంకేసి శ్రీవాణి, సీఏ లక్ష్మీదేవి, జీపీ సిబ్బంది శ్రీనివాస్, సుదర్శన్, రంజిత్ పాల్గొన్నారు.
మొక్కలు నాటి.. ట్రీగార్డుల ఏర్పాటు
పరకాల: పట్టణంలోని వెల్లంపల్లి, హుజూరాబాద్ రోడ్లలోని డివైడర్లలో కూలీలు పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నారు. వెనువెంటనే ట్రీగార్డులు ఏర్పాటు చేస్తున్నారు. 11వ వార్డులో మున్సిపల్ వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్రెడ్డి స్థానిక ప్రజలకు మొక్కలు పంపిణీ చేశారు.
గ్రామాల్లో మొక్కల పంపిణీ
దామెర: హరితహారంలో భాగంగా పంచాయతీల సిబ్బంది ఓగ్లాపూర్, ఊరుగొండ, పసరగొండ, దామెరలో ట్రాక్టర్లు, ఆటో ట్రాలీల్లో తీసుకొచ్చి ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో కారోబార్లు శ్రీనివాస్, బొబ్బిలి, సాగర్ తదితరులు పాల్గొన్నారు.