శ్రీశైలం : శ్రీశైల భ్రమరాంబికా మల్లిఖార్జునస్వామి అమ్మవార్ల హుండీని మంగళవారం ఉదయం లెక్కించారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో పటిష్ఠ భద్రత నడుమ ఆలయ సిబ్బంది, శివసేవకులు, భక్తులు లెక్కింపు చేపట్టారు. 19 రోజులకుగాను రూ. 1,96,05,093 (కోటి తొంభై ఆరులక్షల ఐదు వేల తొంభై మూడు) నగదును భక్తులు కానుకగా సమర్పించినట్లు ఈఓ కేఎస్ రామారావు తెలిపారు.
వీటితోపాటు 282.4 గ్రాముల బంగారం, 9.3 కేజీల వెండి ఆభరణాలు, 54 డాలర్లు (యూఎస్ఏ), 02 సింగపూర్ డాలర్లు, 20 ఇంగాండ్ ఫౌండ్లు, 7 ఓమన్ రియాల్స్, 10 ఫ్రాన్స్ సూసిస్ కరెన్సీని సమర్పించినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
చైత్రమాసంలో శ్రీభ్రమరాంబ అమ్మవారికి సాత్వికబలి నిర్వహించేందుకు జరిగే కుంభోత్సవానికి ఆరంభ ప్రతీకగా కొబ్బరికాయలు సమర్పించారు.
దేవస్థానం ఆనవాయితీ ప్రకారం స్వామివారి ఆలయంలో పనిచేసే పురుషుడు స్త్రీవేషధారణలో అమ్మవారికి ఇవాళ కొబ్బరికాయలు సమర్పించారు.
శివరాత్రి తరువాత వచ్చే ప్రతి మంగళ, శుక్రవారాల్లో కొబ్బరికాయలు రాశులుగా పోసి, పసుపు, కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహించి సింహ మండపం వద్ద అమ్మవారి సమర్పించనున్నట్లు ప్రధాన అర్చకులు తెలిపారు.
ఏప్రిల్ 30వ తేదీన అమ్మవారికి సాత్వికబలి కుంభోత్సవం నిర్వహించనున్నట్లు ఈ ఓ కేఎస్ రామారావు పేర్కొన్నారు.
అమ్మవారికి సాత్వికబలి నిర్వహించేందుకు కొబ్బరికాయలు, గుమ్మడికాయలు, నిమ్మకాయలతో కుంభోత్సవం నిర్వహిస్తారు.
కార్యక్రమంలో ఈఓ కేఎస్ రామారావు, ఏఈఓ హరిదాసు, సూపరింటెండెంట్ అయ్యన్న, ఆలయ ప్రధానార్చకులు సిబ్బంది పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి