శ్రీశైలం : శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. సోమవారం ఐదో రోజు ఆలయంలో పూజాధి కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఉదయం చండీశ్వరపూజ, మండపారాధన, కలశార్చన, శివపంచాక్షరీ, జపానుష్టానాలు, రుద్రపారాయణలు, రుద్రహోమం చండీహోమం, జరిపించారు. సాయంత్రం కాలార్చనలు, హోమాల అనంతరం స్వామిఅమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించిన రావణ వాహనంపై వేంచేబు చేసి అక్కమహాదేవి అలంకార మండపంలో షోడశోపచార పూజలు నిర్వహించారు. మంగళవాయిద్యాల నడుమ క్షేత్ర వీధుల్లో ఊరేగించారు. చెంచు కళాకారుల జానపదాలు, కోలాటాలు, శివసత్తుల విన్యాసాల నడుమ సందడితో ఊరేగింపు కొనసాగింది. రావణ వాహనాధీశుడిని దర్శించుకున్న వారికి కష్టాలు తొలగి సుఖసంతోషాలు కలుగుతాయని ప్రధాన అర్చకుడు భద్రయ్య తెలిపారు. గ్రామోత్సవంలో ఈఈ బాలమురళీకృష్ణ, డీఈ నర్సింహారెడ్డి, శ్రీనివాసరెడ్డి, పీఆర్ వో శ్రీనివాసరావు, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నర్సింహారెడ్డి, ఏఈఓలు కృష్ణారెడ్డి, డీ మల్లయ్య, హరిదాసు, సంపాదకుడు అనీల్ కుమార్, పర్యవేక్షకుడు శ్రీహరి, హిమబిందు, సూపరింటెండెంట్ అయ్యన్న, రవికుమార్ పాల్గొన్నారు.
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు మంగళవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించినట్లు ఈ ఓ కేఎస్ రామారావు తెలిపారు. ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, శ్రీశైల శాసన సభ్యుడు శిల్పాచక్రపాణి రెడ్డిలతోపాటు రెవెన్యూ ఆరోగ్య పోలీస్ శాఖల అధికారులు ఆదిదంపతులను దర్శించుకొని పట్టువస్త్రాలు సమర్పించారు. రావణవాహన సేవ పూజా కార్యక్రమాల్లో పాల్గొని గ్రామోత్సవాన్ని ప్రారంభించారు. ఆలయ సంప్రదాయం.. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం పట్టువస్త్రాలు సమర్పించినట్లు ఈఓ తెలిపారు.