శ్రీశైలం : శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీభ్రమరాంబాదేవి అమ్మవారికి శుక్రవారం శాస్త్రోక్తంగా కుంభోత్సవం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేఎస్ రామారావు తెలిపారు. కొవిడ్ నేపథ్యంలో ఆలయ దర్శనానికి నిబంధనలు కఠినతరం చేశామని పేర్కొన్నారు.
కుంభోత్సవానికి పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తామని, ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి ఇబ్బంది పడొద్దని సూచించారు.
కుంభోత్సవంలో భాగంగా అమ్మవారికి ప్రాత:కాల పూజల అనంతరం కొబ్బరికాయలు, గుమ్మడికాయల సమర్పించనున్నారు.
కోటమ్మవారి పూజలు, అన్నాభిషేకం, కుంభహారతి తదితర కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. కుంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి హాజరుకానున్నారు.
పరిమిత సంఖ్యలో స్థానిక భక్తులకు కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా సాయంత్రం ఆలయం దర్శనానికి అవకాశం కల్పిస్తున్నారు.
కుంభోత్సవం ఉండటంతో రేపు ఉభయ దేవాలయాల్లో జరిగే ఆర్జిత సేవలు, పరోక్ష సేవలను నిలిపివేస్తున్నారని ఆలయ అధికారులు వెల్లడించారు.
క్షేత్ర పరిధిలో జంతు, పక్షులను బలి ఇవ్వడం.. మద్యం, మాంసాహారాలను వండివార్చడం నేరమని ఈఓ హెచ్చరించారు.
టోల్గేట్ వద్ద కోళ్లు, మేకలతో క్షేత్ర ప్రవేశం చేసేందుకు ప్రయత్నించిన వారిని ఆయన అడ్డుకున్నారు. దేవాదాయ చట్టాన్ని అతిక్రమించి జంతు బలి ఇచ్చేందుకు యత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆలయ పరిసరాలు మాడవీధులు, ప్రధాన ద్వారాలు, పంచమఠాలు, బయలు వీరభద్రస్వామి, మహిషాశురమర్ధినీ, సుంకాలమ్మ ఆలయం, సాక్షి గణపతి, టోల్గేట్ వద్ద ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నర్సింహరెడ్డి తెలిపారు.
కోళ్లు, మేకలు, మద్యం, మాంసాహారం తీసుకువచ్చిన ఆరుగురిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.