శ్రీశైలం : శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరడం.. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో ప్రాజెక్టు రెండు క్రస్టుగేటును అధికారులు ఎత్తారు. శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అధికారులతో కలిసి ప్రాజెక్టు గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేశారు. క్రస్టుగేట్ల గుండా దాదాపు 40 వేల క్యూసెక్కులు నాగార్జున సాగర్ వైపు వెళ్తున్నది. ఇన్ఫ్లోను బట్టి అర్ధరాత్రి వరకు 10 గేట్లను ఎత్తనున్నట్లు శ్రీశైలం ప్రాజెక్ట్ ఎస్ఈ వెంకట రమణయ్య తెలిపారు. శ్రీశైలానికి ఎగువ నుంచి దాదాపు 4.65 లక్షల ఇన్ఫ్లో వస్తున్నది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 885 అడుగులు (215 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 881.50 అడుగులు (196 టీఎంసీలు)గా ఉంది. ఇప్పటికే శ్రీశైలం నిండటంతో ఇక వచ్చిన వరద వచ్చినట్లు నాగార్జున సాగర్కు చేరనుంది. ప్రవాహం ఇదే రీతిలో కొనసాగితే మరో వారం రోజుల్లో నాగార్జున సాగర్ సైతం నిండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.