అమరావతి : ఏఓబీలో మావోయిస్టుల ప్రాబల్యం చాలా వరకు తగ్గిందని ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. గత నెలలో లొంగిపోయిన స్పెషల్ జోనల్ కమాండర్ ఇక్కడి పరిస్థితిని పోలీసులకు చెప్పారని ఆయన వివరించారు. ఇవాళ ఆరుగురు మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలిపారు. డివిజనల్ కమాండర్, ఇద్దరు కమాండర్లు, మరో ముగ్గురు కీలక నేతలు లొంగిపోయినట్లు వెల్లడించారు. ‘ప్రభుత్వం అన్ని సమస్యలను పరిష్కరిస్తుండటంతో బేస్ ఏరియాల్లో సైతం మావోయిస్టుల ప్రభావం తగ్గినట్లు నివేదకలు చెబుతున్నాయి. రక్తపాతం ద్వారా సమస్యలు పరిష్కారం కావని ఆదివాసీలకు అర్ధమైంది.
విద్య, వైద్యం సమస్యలు ఆదివాసీలకు ఇప్పుడు లేవు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం పోరాడదామని మావోయిస్టులు పిలుపునిచ్చినా గిరిజనులు ఆసక్తి చూపట్లేదు. గతంలో ఏవోబీలో 8 మావోయిస్టు కమిటీలు ఉండేవి ఇప్పుడు 4 కమిటీలు కూడా లేవు. అనేకమంది మావోయిస్టులు ఇప్పటికే జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు ప్రభుత్వ కార్యక్రమాలు బాగా చేరుతున్నాయి. వలంటీర్ల వ్యవస్థ బాగా పని చేస్తుంది.
నేరుగా లబ్ధిదారులకు పథకాలు అందుతున్నాయి. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థలోనూ అనేక మార్పులు వచ్చాయి. పోలీసుల భాష, ప్రవర్తన మారింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గిరిజనుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నారు. మావోయిస్టులకి ఆదివాసీల మద్దతు లేదు. రిక్రూట్మెంట్కు ఏపీ యువత ముందుకు రాకపోవడంతో ఛత్తీస్ ఘడ్ నుంచి నియమించుకుంటున్నారు. స్థానిక సమస్యలపై, తెలుగు భాషపై వాళ్లకు అవగాహన లేకపోవడంతో కేవలం తుపాకులు పట్టుకుని తిరుగుతున్నారు. వాళ్లలో చాలామంది లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు’ అని డీజీపీ తెలిపారు.