అపర భగీరథుడు సీఎం కేసీఆర్ కల సాకారమైంది. ఎక్కడో ఉన్న గోదారమ్మను కొండపోచమ్మ సాగర్కు తీసుకువచ్చి, అక్కడి నుంచి సంగారెడ్డి కెనాల్ ద్వారా హల్దీవాగుకు, అక్కడి నుంచి మంజీరా నది మీదుగా నిజాంసాగర్ ప్రాజెక్టుకు నీటిని పంపిస్తున్నారు. ఈ నెల 6న సీఎం కేసీఆర్ సంగారెడ్డి కెనాల్ అవుసులపల్లి వద్ద నీటిని విడుదల చేశారు. కాగా, ఈ నాలుగు రోజుల్లో వర్గల్ మండలంలోని బంధం చెరువు, పెద్దచెరువు, ధర్మాయిచెరువు, ఖాన్ చెరువులు నిండి హల్దీవాగులోకి గోదారమ్మ పరుగులు పెడుతున్నది. మండుటెండల్లో గోదారమ్మ తరలిరావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేస్తున్నారు. ఎనకటి కాలం రోజులను గుర్తుచేసుకుంటూ.. నాడు ఈత కొట్టిన రోజులను రైతులు నెమరు వేసుకుంటున్నారు.
సిద్దిపేట, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ ద్వారా సంగారెడ్డి కెనాల్ నుంచి హల్దీవాగు, అక్కడి నుంచి మంజీరా నదికి, అక్కడి నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టుకు గోదావరి జలాలు మరో వారం రోజుల్లో తరలనున్నాయి. ఇప్పటికే సుమారు 6కిలోమీటర్ల వరకూ ప్రయాణించి నాలుగు చెరువులు నిండుకుని శనివారంలోగా హల్దీవాగులోకి గోదావరి జలాలు ప్రవేశించనున్నాయి. సంగారెడ్డి కెనాల్ నుంచి తొలుత 1.20 కి.మీ దూరంలోని చౌదరిపల్లి బంధం చెరువులోకి నీళ్లు వెళ్లాయి. ఈ చెరువు సామర్ధ్యం 12 ఎంఎస్ఎఫ్టీ కాగా, 118 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ చెరువు నిండి అలుగు పారడంతో 2.60 కిలోమీటర్ దూరంలో ఉన్న వర్గల్ పెద్ద చెరువులోకి గోదావరి నీళ్లు వెళ్లాయి. ఈ చెరువు కెపాసిటీ 10 ఎంఎస్ఎఫ్టీ, దీని కింద 90 ఎకరాల ఆయకట్టు ఉంది. జలాల రాకతో ఈ చెరువు కింద ఉన్న పంటలకు ప్రాణం పోసినైట్లెంది. ఈ చెరువు అలుగు పారడంతో అక్కడి నుంచి 1.36కి.మీ దూరంలోని శాకారం ధర్మాయి చెరువులో గోదారమ్మ జలసవ్వడి చేసింది. ఈ చెరువు సామర్ధ్యం 15 ఎంఎస్ఎఫ్టీలు కాగా, 140 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇక్కడి నుంచి 1.15 కిలోమీటర్ దూరంలోని అంబర్పేట ఖాన్ చెరువులోకి గోదావరి జలాలు చేరుతున్నాయి. శనివారం తెల్లవారుజాము వరకు ఆ చెరువు అలుగు పారి హల్దీవాగులోకి గోదావరి జలాలు పరుగులు పెట్టనున్నాయి. ఖాన్చెరువు కెపాసీటి 58 ఎంఎస్ఎఫ్టీ కాగా, దీని కింది 580 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇక హల్దీవాగులో గోదారమ్మ పరుగులు పెట్టి నాచారం లక్ష్మీనర్సింహా స్వామి సన్నిధి నుంచి మెదక్ జిల్లాలోకి ఆదివారం వరకు ప్రవహించే అవకాశాలున్నాయి. సంగారెడ్డి కెనాల్ ప్రారంభ సమయంలో కేవలం 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మూడు రోజులుగా నీళ్లు ప్రవహిస్తుండడంతో ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో, శుక్రవారం నుంచి నీటి విడుదలను 1600 క్యూసెక్కులకు పెంచారు. దీంతో నీటి ప్రవాహం పెరగడంతో చెరువులు, చెక్డ్యాంలు త్వరగా నిండుతున్నాయి.
హల్దీవాగుపై చెక్డ్యాంలు ..
గోదారమ్మ గలగల పరుగులు తీస్తూ హల్దీవాగు మీదుగా మంజీరాను ముద్దాడి నిజాంసాగర్లోకి ప్రవహించనున్నది. సిద్దిపేట, మెదక్ జిల్లాలను కలుపుకొని మొత్తం 70 కిలోమీటర్లు ప్రవహించి 32 చెక్డ్యాంలను నింపి మంజీరా నదిలోకి జలాలు వెళ్తాయి. అక్కడి నుంచి మరో 20 కిలోమీటర్లు ప్రయాణించి కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టులోకి జలాలు వెళ్తాయి. హల్దీ వాగుపైన 32 చెక్డ్యాంలు ఉన్నాయి. వీటిలో సిద్దిపేట జిల్లాలో 9, మెదక్ జిల్లాలో 23 చెక్డ్యాంలు ఉన్నాయి. మొత్తం 32 చెక్డ్యాంల సామర్ధ్ధ్యం 621.28 ఎంస్ఎఫ్టీ (0.6 టీఎంసీ)లు ఉంటుంది. వీటి కింద 14,628 ఎకరాల ఆయకట్టు ఉంది. హల్దీవాగుకు నీటిని విడుదల చేయడంతో ఈ వాగు పరీవాహక ప్రాంత పంటలకు జీవం పోసినట్లయ్యింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని వర్గల్ మండలంలోని తున్కిఖల్సాలో 3 చెక్డ్యాంలు, అంబర్పేటలో 1, వేలేరులో 3, నాచారంలో 2 చెక్డ్యాంలు మొత్తం 9 చెక్డ్యాంలు ఉన్నాయి. ఈ చెక్డ్యాంల కెపాసిటీ 105.53 ఎంస్ఎఫ్టీ సామర్ధ్యం. వీటి కింద 633 ఎకరాల ఆయకట్టు ఉంది. మెదక్ జిల్లాలోని తూప్రాన్ మండలం యావాపూర్లో 3, కిష్టాపూర్లో 1, తూప్రాన్లో 1, ఇస్లాంపూర్లో 1, నాగులపల్లిలో 3 మొత్తం 9 చెక్డ్యాంలు ఉన్నాయి. నర్సాపూర్ నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలంలోని వెల్దుర్తిలో 4, హకీంపేటలో 1, ఉప్పులింగాపూర్లో 1, కుకునూర్లో 1, దామరంచలో 2, కొల్చారం మండలం కొంగోడులో 1, మెదక్ నియోజకవర్గంలోని మెదక్ మండలంలో జానకంపల్లిలో 1, ర్యాలమడుగులో 2, హవేళిఘనపూర్ మండలంలో సర్దనలో 1 చెక్డ్యాం ఉంది. మొత్తంగా 23 చెక్డ్యాంల నీటి సామర్ధ్యం 515.75 ఎంస్ఎఫ్టీలు ఉంటుంది. వీటి కింద 13,635 ఎకరాల ఆయకట్టు ఉంది.
వారం రోజుల్లో నిజాంసాగర్కు గోదారమ్మ..
హల్దీవాగు నుంచి మంజీరా మీదుగా 90 కిలోమీటర్ల దూరంలోని నిజాం సాగర్కు గోదావరి జలాలు నింపాలన్న సీఎం కేసీఆర్ కల సాకారమవుతున్నది. వారం రోజుల్లో నిజాంసాగర్కు గోదావరి జలాలు చేరుకుంటాయి. సిద్దిపేట, మెదక్ జిల్లాలోని హల్దీవాగుపై ఉన్న 32 చెక్డ్యాంలు నిండి నిజాంసాగర్కు జలాలు వెళ్తాయి. రోజుకు 1600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నాం. ఇప్పటికే బంధం చెరువు, పెద్దచెరువు, ధర్మాయి చెరువు నిండి ఖాన్ చెరువులోకి జలాలు వెళ్తున్నాయి. ఖాన్ చెరువు అలుగు పారి హల్దీవాగులోకి నేడు గోదావరి జలాలు చేరుతాయి.
– హరిరాం, ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ)
ఇవీ కూడా చదవండి…
కరోనా+పెట్రో రేట్లు.. టూ వీలర్స్ సేల్స్ డౌన్..