హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): కొవిడ్ సోకినవారిలో కంటి సమస్యలు మొదలవుతున్నట్టు గుర్తించామని డాక్టర్ అగర్వాల్స్ కంటి దవాఖాన వైద్య బృందం పేర్కొన్నది. కండ్ల కలక, కెరాటో కంజెక్టివైటిస్, బ్లీ ఫార్టీస్, రెటినల్ మైక్రోవాస్కులర్ సమస్యలు వంటివి కనిపిస్తున్నాయని దవాఖాన రీజినల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ గౌరవ్ అరోరా శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ఐసీయూలో చికిత్స పొందిన రోగుల్లో కార్నియల్ ఇన్ఫెక్షన్స్, ఇషెమిక్ ఆప్టిక్ న్యూరోపతి, వాల్సావా రెటినోపతి తదితర ఇన్ఫెక్షన్లు కనిపిస్తున్నాయని చెప్పారు. గత ఏడాదికాలంలో ప్రజల్లో కంటి సమస్యలు పెరిగాయని, ముఖ్యంగా అడ్వాన్స్డ్ కాటరాక్ట్, పొడికండ్ల కేసులు 5 రెట్లు పెరిగాయని చెప్పారు. కరోనా కారణంగా చికిత్సను ఆలస్యం చేయడం, వర్క్ఫ్రం హోం వల్ల జీవితంలో సమతుల్యం దెబ్బతినడం ఇందుకు ప్రధాన కారణాలని తెలిపారు. 2019 చివరి త్రైమాసికంలో తమ వద్దకు వచ్చిన కాటరాక్ట్ రోగుల్లో 10 శాతం కన్నా తక్కువ మంది మాత్రమే అడ్వాన్స్ కాటరాక్ట్తో బాధపడేవారని, గతేడాది చివరికి ఈ సంఖ్య 50 శాతానికిపైగా పెరిగిందని చెప్పారు. డిజిటల్ స్క్రీన్ ఎక్కువగా చూడటం వల్ల కండ్లు పొడిబారడం (డ్రై ఐస్) కేసులు కూడా పెరిగాయన్నారు. 2019 చివరికి 10 శాతం ఉన్న ఈ కేసులు గతేడాది చివరినాటికి 30-50 శాతానికి పెరిగాయని వెల్లడించారు. వీటితోపాటు గ్లకోమా కేసులు కూడా పెరిగినట్టు గుర్తించామన్నారు. మధుమేహంతో బాధపడుతున్నవారు కరోనా కాలం లో పరీక్షలు సరిగా చేయించుకోకపోవడంతో వారి రెటీనాలో సమస్యలు ఉత్పన్నమయ్యాయని వివరించారు. కొందరు సమస్య తీవ్రంగా ఉన్నా కరోనాకు భయపడి కాటరాక్ట్ శస్త్రచికిత్స చేయించుకోవడం ఆలస్యం చేశారని, దీంతో పాక్షికంగా కంటి చూపు కోల్పోయిన ఘటనలు ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో దవాఖాన సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ భాను ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.