పశ్చిమ గోదావరి : కరోనా మహమ్మారికి భయపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు.. 15 నెలల పాటు ఒకే గదిలో జీవనం కొనసాగించారు. ఆ గదిలోనే కాలకృత్యాలు తీర్చుకోవడం, ఆహారం తినడం, పడుకోవడం జరిగాయి. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలోని రాజోలు మండలం కడలి గ్రామంలో వెలుగు చూసింది.
కడలి గ్రామానికి చెందిన జాన్ బెన్ని(50), రుత్తమ్మ(45) దంపతులు, వారి ఇద్దరు కూతుళ్లు కాంతామణి(30), రాణి(32)తో పాటు కుమారుడు ఒకే ఇంట్లో ఉంటున్నారు. అయితే 15 నెలల క్రితం రుత్తమ్మ ఇంటి పక్కనే కరోనాతో ఓ వ్యక్తి చనిపోయాడు. దీంతో తీవ్ర భయాందోళనలకు గురైన ఆ కుటుంబం బయటకు వచ్చేందుకు భయపడింది. ఇంటి బయటకు వస్తే కరోనా తమకు సోకుతుందేమోనని భయపడ్డారు. ఇక రుత్తమ్మ, కాంతామణి, రాణి.. ముగ్గురూ కలిసి ఒకే గదిలో ఉండిపోయారు. అలా ఒకట్రెండు రోజులు కాదు.. ఏకంగా 15 నెలలు ఆ గదిలోనే గడిపారు. నిత్యవసరాలు, ఇతర పనుల కోసం జాన్ బెన్ని, ఆయన కుమారుడు మాత్రమే బయటకు వచ్చేవారు. ఈ ముగ్గురు మహిళలలు తాము ఉంటున్న గదిలోనే కాలకృత్యాలు తీర్చుకోవడం, అక్కడే తినడం, పడుకోవడం చేశారు.
అయితే జాన్ బెన్ని ఇంటి స్థలం విషయంలో బయో మెట్రిక్ ద్వారా ఆ కుటుంబ సభ్యుల వేలిముద్రలు తీసుకునేందుకు వాలంటీర్లు ఆ ఇంటికి వెళ్లారు. తమకు ఇంటి స్థలం వద్దని, బయటకు రాలేమని రుత్తమ్మ.. వాలంటీర్లకు సమాధానం ఇచ్చింది. ఈ క్రమంలో వాలంటీర్లు ఉన్నతాధికారులకు తెలుపగా.. అసలు విషయం వెలుగు చూసింది. కరోనాకు భయపడి ఇంట్లో నుంచి బయటకు రావడం లేదని అధికారులు, పోలీసుల విచారణలో తేలింది.
రుత్తమ్మ, కాంతామణి, రాణి ఆరోగ్యం బాగా క్షీణించింది. ఒకే గదిలో 15 నెలల పాటు ఉండి అన్ని కార్యక్రమాలు అందులోనే చేయడంతో.. వారు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో బాధిత మహిళలను రాజోలు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ముగ్గురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.