గుమ్మడిదల, ఏప్రిల్19 : సుప్రసిద్ధ శైవక్షేత్రమైన బొంతపల్లి భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయానికి చెంది న భూములను ట్రిబ్యునల్ కోర్టు ఆదేశాల మేరకు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆలయానికి చెందిన 685 సర్వే నంబర్లో 0.17 గుంట లు, 686 సర్వే నంబర్లో 6.35 ఎకరాల భూమి వీరన్నగూడెం గ్రామానికి చెందిన మడపతి గణేశ్ ఆధీనంలో ఉంది. ఈ భూములు వీరభద్రస్వామి వారికి చెందినవని జనవరి 1. 2020లో ట్రిబ్యునల్ కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో సోమవారం ఉమ్మడి మెదక్ జిల్లా దేవాదాయ ధర్మాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ బొల్లంపల్లి కృష్ణ, ఈవో శశిధర్ గుప్త్తా, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, గిర్దావరి రామచందర్తో కలిసి సీఎం లాలూనాయక్, ఎస్సై విజయకృష్ణ పోలీస్ సిబ్బంది పర్యవేక్షణలో ఆ భూములు దేవాలయానికి చెందినవిగా బోర్డులు పాతారు. ఆ భూమిలో నడుస్తున్న ఆర్వో ప్లాంటును సీజ్ చేసి పంచనామా చేశారు. ఈసందర్భంగా అసిస్టెంట్ కమిషనర్ బొల్లంపల్లి కృష్ణ మాట్లాడుతూ 685, 686 సర్వే నంబర్లలో 7 ఎకరాల 11 గంటల భూమి వీరభద్రస్వామి దేవాలయానికి చెందినవని, ట్రిబ్యునల్ కోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా, దేవాదాయ ధర్మాదాయశాఖ కమిషనర్ అనీల్కుమార్ ఆదేశాల మేరకు సంబంధిత భూమిలో బోర్డు పాతి, ఆర్వో ప్లాంటును స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు తెలిపారు. ఇక నుంచి ఈ భూములు దేవాలయానికి చెందినవన్నారు. అయితే, 1954-55 నాటి నుంచి రెవెన్యూ రికార్డులో 685,686 సర్వే నంబర్లకు చెందిన భూములు కాస్రా పహానీలో ఉందని, అప్పటి నుంచి తాము సాగు చేస్తున్నామని, మా మడపతి కుటుంబం వీరభద్రస్వామి ఆలయంలో ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తూ నిత్యపూజలు చేస్తున్న అర్చక కుటుంబమని మడపతి గణేశ్ అన్నారు.
ఇవీ కూడా చదవండి…