మేడ్చల్ రూరల్, ఏప్రిల్ 2 : క్రీడలతోనే మానసిక ఉల్లాసం లభిస్తుందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ సరస్వతీ క్రికెట్ మైదానంలో ‘గుండ్లపోచంపల్లి ప్రీమియర్ లీగ్’ పేరుతో నిర్వహిస్తున్న టోర్నమెంట్ను శుక్రవారం మంత్రి మున్సిపాలిటీ చైర్పర్సన్ మద్దుల లక్ష్మీశ్రీనివాస్రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి చామకూర మహేందర్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటలు విద్యార్థులు, క్రీడాకారులకే కాదన్నారు. ప్రతి ఒక్కరూ కొంత సమయాన్ని క్రీడల కోసం కేటాయిస్తే ఆరోగ్యంగా జీవించవచ్చన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై దృష్టి సారించాలని సూచించారు. ఆసక్తి ఉన్న రంగాల్లో తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రోత్సహించాలని కోరారు. ప్రజాప్రతినిధులు, అధికారులు క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొని, క్రీడాస్ఫూర్తిని చాటడం హర్షణీయమని తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో ప్రతిభ ఉన్న క్రీడాకారులను వెలికితీసి, ప్రోత్సహించాలని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.