అమరావతి : దివంగత విశాఖ మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నాయకుడు సబ్బం హరి అంత్యక్రియలను మంగళవారం ఉదయం 9 గంటల తరువాత కేఆర్ఎం శ్మశానవాటికలో నిర్వహించనున్నట్లు ఆయన కుమారుడు సబ్బం వెంకట్ తెలిపారు.
ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగానే సబ్బం హరి మృతి చెందినట్లు ఆయన స్పష్టం చేశారు. చికిత్స తరువాత తన తండ్రికి కొవిడ్ నెగిటివ్ వచ్చిందని వెల్లడించారు.
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నిత్యం ఆరోగ్య వివరాలు అడిగే వారని తెలిపారు. తన కుటుంబానికి అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
కొవిడ్ వేళ అభిమానులెవరూ అంత్యక్రియలకు రావొద్దని కోరారు. ఏప్రిల్ 15న సబ్బం హరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
దీంతో ఆయన మూడు రోజులపాటు హోం క్వారంటైన్లో ఉన్నారు. అనంతరం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు వైజాగ్ అపోలో ఆస్పత్రిలో చేరారు.
వెంటిలేటర్పై చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటా 22 నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.