న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: అఫ్ఘనిస్థాన్ నుంచి సెప్టెంబర్ 11లోగా తమ బలగాలను పూర్తిగా భేషరతుగా ఉపసంహరించుకొంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బుధవారం చేసిన ప్రకటన, తమ బలగాలు కూడా వెనక్కు వచ్చేస్తాయన్న నాటో ప్రకటన అఫ్ఘనిస్థాన్ చుట్టుపక్కల దేశాల్లో జాతీయ భద్రతకు సంబంధించిన చర్చను లేవనెత్తింది. మిగతా దేశాల సంగతెలా ఉన్నా ఈ పరిణామం భారత్కు ఇబ్బందికరమేనని రక్షణ, విదేశీ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 1990ల్లో అఫ్ఘనిస్థాన్లో తాలిబన్లు అధికారంలో ఉన్న సమయంలో ఆ దేశం ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉంది.
భారత్పై దాడులకు పాల్పడటానికి ఎందరో ఉగ్రవాదులు అఫ్ఘనిస్థాన్లో శిక్షణ పొందారు. 2001లో పార్లమెంటుపై దాడికి పాల్పడ్డ జైషే మహమ్మద్, లష్కరే తాయిబా ఉగ్రసంస్థలకు చెందినవారు కూడా ఇందులో ఉన్నారు. 1999లో భారత విమానాన్ని హైజాక్ చేసినప్పుడు కూడా ఉగ్రవాదులకు తాలిబన్లు సహకరించారు. దీన్ని బట్టి అఫ్ఘనిస్థాన్లో మళ్లీ తాలిబన్లు అధికారంలోకి వస్తే భారత్కు భద్రతాపరమైన సమస్యలు తప్పకపోవచ్చని విశ్లేషిస్తున్నారు.
ఉగ్రవాద నిరోధక చర్యలకు ఆటంకం కలగొచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా తాలిబన్లు, పాకిస్థాన్ మిత్రులుగా ఉన్నారు. ప్రస్తుతం శాంతి చర్చల కోసం తాలిబన్లను ఒప్పించాల్సిందిగా అమెరికా పాకిస్థాన్ సాయం కోరుతుందంటే వారి మధ్య మైత్రి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అఫ్ఘన్లో ప్రజాస్వామ్య ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాలిబన్లు చేస్తున్న దాడులకు పాక్ సహాయం అందిస్తున్నదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో తాలిబన్లు అధికారంలోకి వస్తే అఫ్ఘనిస్థాన్ వ్యవహారాలపై పాక్ గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉన్నది. ప్రస్తుతం అఫ్ఘనిస్థాన్లో భారత్ ఎన్నో పెట్టుబడులు పెట్టింది. రెండు దేశాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. ఉగ్రవాదంపై పోరులో, రక్షణ పరంగా ఇది అత్యంత కీలకం. తాలిబన్లు అఫ్ఘనిస్థాన్లో అధికారం చేపడితే ఈ సంబంధాలు చెడిపోవచ్చు.
అఫ్ఘన్లో మళ్లీ అంతర్యుద్ధం?
అమెరికా బలగాలు వెళ్లిపోయాక తాలిబన్లు అఫ్ఘనిస్థాన్ను గుప్పిట్లో పెట్టుకొంటారన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రజాస్వామికవాదులు, తాలిబన్ల మధ్య అంతర్యుద్ధం తప్పకపోవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే తాలిబన్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో దాడులు జరుపుతున్నారు. తాలిబన్ల దాడిలో జనవరి నుంచి మార్చి మధ్యలో 1,700 మంది పౌరులు చనిపోయారు. మరోవైపు ప్రభుత్వంతో శాంతి ఒప్పందానికి రమ్మంటే తాలిబన్లు రావడం లేదు. విదేశీ బలగాలు తమ దేశంలో ఉన్నంతవరకు తాము చర్చల్లో పాల్గొనబోమని తెగేసి చెప్తున్నారు. అఫ్ఘన్ ప్రభుత్వం, తాలిబన్ల మధ్య శాంతి ఒప్పందం కోసం ఏప్రిల్ 24- మే 4వ తేదీల మధ్య టర్కీలో చర్చలు జరుగనున్నాయి. వీటికి తాలిబన్లు హాజరవుతారా..? అన్నది అనుమానమే.