చిత్తూరు : కోడి పెట్ట గుడ్లు పెట్టడం చూశాం.. కానీ ప్రకృతికి విరుద్ధంగా కోడి పుంజు గుడ్లు పెట్టింది. పుంజు గుడ్లు పెట్టడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం పెద్దకన్నలి గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఈ ఘటన వెలుగు చూసింది.
ఎస్సీ కాలనీకి చెందిన సుబ్రమణ్యం అనే వ్యక్తి గత కొంతకాలం నుంచి కోళ్లను పెంచుకుంటున్నాడు. అయితే తాను పెంచుకుంటున్న ఓ పుంజు కోడిగుడ్లను పెట్టింది. ఒకట్రెండు గుడ్లు కాదు.. ఏకంగా 11 గుడ్లను పెట్టి పొదిగింది. ఐదు కోడిపిల్లలకు జన్మనిచ్చి.. వాటిని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది.
పుంజు గుడ్లను పెట్టే కంటే ముందు.. మరో పుంజుతో తిరిగేదని యజమాని చెప్పాడు. పుంజు గుడ్లను పెట్టిన వింతను చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోతున్నారు. జన్యుపరమైన కారణాల వల్లే కోడి పుంజు గుడ్లు పెట్టి పొదిగిందని వెటర్నరీ అధికారులు తెలిపారు.