తిరుమల, జూన్12: భక్తుల సౌకర్యార్థం శనివారం నుంచి తిరుమలలోని ఆరు ప్రాంతాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా వసతి గదుల కోసం పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని టిటిడి కల్పిస్తోందని అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలోని సిఆర్వో వద్ద అదనపు ఈవో పూజలు నిర్వహించి కౌంటర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు తిరుమలలో వసతి కోసం సిఆర్వో వద్ద భక్తులకు పేర్లు రిజిస్ట్రేషన్, గదులు కేటాయిస్తున్నారన్నారు. సిఆర్వో వద్ద భక్తుల రద్ధీ అధికంగా ఉండటం, పార్కింగ్ సౌకర్యం లేకపోవడం వలన ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. కావున భక్తులకు మరింత త్వరితగతిన పేర్లు నమోదు, గదుల కేటాయింపు కోసం తిరుమలలోని వివిధ ప్రాంతాలలో కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఇందులో భాగంగా సిఆర్వో వద్ద రెండు కౌంటర్లు, బాలాజి మెయిన్ బస్టాండ్ వద్ద రెండు కౌంటర్లు, కౌస్తుభం అతిథి భవనం వద్ద ఉన్న కారు పార్కింగ్ ప్రాంతంలో రెండు కౌంటర్లు, రాంభగిచ బస్టాండ్ వద్ద రెండు కౌంటర్లు, ఎమ్బిసి ప్రాంతంలోని శ్రీవారి మెట్టు వద్ద రెండు కౌంటర్లు, జిఎన్సి టోల్గేట్ వద్ద ఉన్న లగేజి కౌంటర్ నందు రెండు కౌంటర్లలో భక్తులు వసతి కోరకు పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.