పది రోజుల్లో పనులన్నీ పూర్తి చేయాలి
అధికారులకు కలెక్టర్ కే శశాంక ఆదేశం
ఖాజీపూర్, కమాన్పూర్, చింతకుంటలో పరిశీలన
కొత్తపల్లి, ఏప్రిల్ 6 : మండలంలోని పలు గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులను పది రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ కే శశాంక అధికారులను ఆదేశించారు. మంగళవారం మండలంలోని ఖాజీపూర్, కమాన్పూర్, చింతకుంట (శాంతినగర్)లో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, డబుల్ బెడ్రూం ఇండ్లన్నింటికీ మిషన్ భగీరథ పైపులైన్లు వేసి తాగునీటి సరఫరా పనులు పూర్తి చేయాలన్నారు. నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూం కాలనీల్లో అంతర్గత రోడ్ల పనులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. లబ్ధిదారులు నివాసం ఉండేలా అన్ని మౌలిక వసతులు కల్పించాలన్నారు. ఇండ్ల సముదాయాల ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు వేసి కరెంట్ సౌకర్యం కల్పించాలని చెప్పారు. ప్రతి ఇంటికీ పూర్తి స్థాయిలో డోర్లు, కిటికీలను బిగించాలన్నారు. చింతకుంటలో డ్రైనేజీ, శానిటేషన్పై ఎదురవుతున్న ఇబ్బందులను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. మొత్తంగా పది రోజుల వ్యవధిలో డబుల్ బెడ్రూం ఇండ్లల్లో మౌలిక వసతులు కల్పించి ప్రారంభానికి సిద్ధంగా ఉంచాలన్నారు. కార్యక్రమంలో కొత్తపల్లి తహసీల్దార్ చిల్ల శ్రీనివాస్, సర్పంచులు జింక సంపత్, మొగిలి మంజుల, ఎంపీవో దొంత శ్రీనివాస్, కార్యదర్శులు రేవంత్రెడ్డి, పద్మ, నాయకులు ఇల్లందుల రాజశేఖర్, సోమినేని తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
సిల్వర్ ఫిలిగ్రీ భవన నిర్మాణ పనుల పరిశీలన
సిల్వర్ ఫిలిగ్రీ భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ శశాంక కాంట్రాక్టర్లను ఆదేశించారు. మండలంలోని ఎల్ఎండీలో నిర్మిస్తున్న సిల్వర్ ఫిలిగ్రీ భవన నిర్మాణ పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సిల్వర్ ఫిలిగ్రీ వస్తువులకు కరీంనగర్ పేరు గాంచిందని, ఈ పరిశ్రమను ప్రోత్సహించేందుకే భవనం నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. భవన నిర్మాణానికి ప్రహరీ నిర్మించడంతో పాటు వస్తువుల సేల్ పాయింట్ ఏర్పాటు చేయాలని సూచించారు. వస్తువులు తయారు చేసే వర్కర్లకు అవసరమైన మౌలిక వసతులు భవనంలో కల్పించాలన్నారు. సిల్వర్ ఫిలిగ్రీ వస్తువుల తయారీకి సంబంధించిన ప్రచార బోర్డులు రోడ్డు పక్కన ఏర్పాటు చేయాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ రాజ్కుమార్, సిల్వర్ ఫిలిగ్రీ తయారీదారులు, తదితరులు పాల్గొన్నారు.