అమరావతి : తిరుపతి అసెంబ్లీ పరిధిలో రీపోలింగ్ నిర్వహించాలని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. దొంగ ఓట్లు ముద్రించిన వారిపై ఐపీసీ కింద కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సీఎం జగన్ ఏపీని దొంగ ఓట్లు- దొంగ నోట్ల రాజ్యంగా మార్చారని అన్నారు.
దొంగల పాలనలో రాష్ట్రం మొత్తం దొంగల మయమైందని ఆయన మండిపడ్డారు. దొంగ ఓట్ల అంశంపై సీఎం జగన్ సమాధానం చెప్పాలన్నారు.దొంగ ఓట్ల ముద్రణ వైసీపీ మంత్రుల ప్రమేయంతో జరిగింది కాదా.? అని నిలదీశారు. పోలింగ్ రోజు వైసీపీ మంత్రులు దొంగ ఓటర్లను బస్సులో తిరుపతికి తీసుకువచ్చారని ఆరోపించారు.
దొంగ ఓట్ల వ్యవహారంలో పట్టుబడి కేసులు నమోదైన 12 మంది అధికార వైసీపీకి చెందిన వారు కాదా.? అని ప్రశ్నించారు. ‘‘దొంగ ఓటర్లను తరలిస్తున్నట్లు కాలవ శ్రీనివాసులు చెప్పినప్పుడే పోలీసులు ఎందుకు స్పందించలేదు.
వాళ్లందరిపై ఎందుకు కేసులు ఎందుకు నమోదు చేయలేదు. వెనక్కి పంపామని డీజీపీ చెప్పిన 250 బస్సులు ఎవరివి. 144 సెక్షన్ విధిస్తే రోడ్లపై వేలాది మంది ఎక్కడి నుంచి వచ్చారు.
ఓటమి భయంతో దొంగ ఓట్లు-దొంగ నోట్లతో సీఎం జగన్ జిత్తులు ప్రదర్శిస్తున్నారు. టీడీపీ ఫిర్యాదులపై సీఈసీ వెంటనే స్పందించాలి’’ అని యనమల డిమాండ్ చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి