విజయవాడ,9మే : మణిపాల్ హాస్పిటల్, విజయవాడ విజయవంతంగా 20ఏండ్ల బీకామ్ విద్యార్థి ఈశ్వర్ సాయి గణేష్కు హప్లోఐడెంటికల్ బోన్మారో మార్పిడి శస్త్రచికిత్సను నిర్వహించింది. సాధారణంగా ఈ ప్రక్రియలో డాక్టర్లు కుటుంబ దాత నుంచి పూర్తిగా సరిపోలిన హెచ్ఎల్ఏకు బదులుగా సగం సరిపోలిన హ్యూమన్ ల్యుకోసైట్ యాంటీజెన్ (హెచ్ఎల్ఏ)ను తల్లిదండ్రులు లేదంటే తోడబుట్టిన వారి నుంచి సేకరిస్తారు. ఇలా చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఈ తరహా మార్పిడి శస్త్ర చికిత్స చేసిన మొట్టమొదటి ఆస్పత్రిగా మణిపాల్ హాస్పిటల్ నిలిచింది.
ఈ మార్పిడి శస్త్రచికిత్స గురించి క్యాన్సర్ వైద్య , మూలకణ మార్పిడి నిపుణులు డాక్టర్ మాధవ్ దంతాల మాట్లాడుతూ ‘‘ఈ రోగికి 2016లో టీ–లింపోబ్లాస్టిక్ లింఫోమాను గుర్తించడం జరిగింది. దీనికి దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు అతను చికిత్స తీసుకున్నాడు. ఈ రోగికి 2019లో అంటే చికిత్స ముగిసిన ఆరు నెలల కాలంలోనే మరలా వ్యాధి బయటపడింది. ఈ రోగిని ఆస్పత్రిలో 20 జనవరి 2021లో చేర్చారు. అక్కడ ఆయనకు వ్యాధిని నియంత్రించడం కోసం కీమోథెరఫీ చికిత్సను అందించారు. దీనికి అతని జబ్బు బాగా తగ్గింది. ఒకసారి వ్యాధి నియంత్రణలోకి వచ్చిన తరువాత మేము హప్లోఐడెంటికల్ (సగం –సరిపోలిన) మూలకణ మార్పిడి శస్త్రచికిత్స చేశాం. తద్వారా ఈ రోగిలో మరలా ఈ వ్యాధి తిరగబెట్టే అవకాశాలు ఉండవు. ఈ చికిత్స కోసం ఈ రోగి తన తండ్రి కోయ శ్రీనివాసరావు నుంచి స్టెమ్ సెల్ను పొందారు’’ అని అన్నారు.