అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ సమస్య (Power Crisis) తీవ్రంగా ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రాకమకృష్ణారెడ్డి వెల్లడించారు. భవిష్యత్తులో అధికారికంగా కరెంటు కోతలు రావొచ్చని ఆయన అన్నారు. ఇళ్లలో కరెంటు వాడకం తగ్గించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల మధ్య కరెంటు వాడకం తగ్గించుకోవాలని సూచన చేశారు.
బొగ్గు కొరత, ధరల పెరుగుదల వల్లే ఈ సమస్య వచ్చిందని, డబ్బులు ఖర్చు చేసినా ఈ సమస్యకు పరిష్కారం దొరికే పరిస్థితి లేదని ఆయన వివరించారు. బొగ్గు కొరత లేదని, అనవసరంగా భయాందోళనలు సృష్టిస్తున్నారని ఇటీవల కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ చేసిన వ్యాఖ్యలపై కూడా సజ్జల స్పందించారు. కేంద్ర మంత్రి మాటలు అవాస్తవాలని కుండ బద్దలు కొట్టారు. విద్యుత్ సమస్య వాస్తవమని, దీన్ని సీఎం జగన్ ఇప్పటికే ప్రధాని దృష్టికి తీసుకెళ్లారని తెలియజేశారు.