Garuda Seva | తిరుమల శ్రీవారి ఆలయంలో గరుడ సేవ కనుల పండువలా సాగింది. పౌర్ణమి సందర్భంగా సేవను టీటీడీ నిర్వహించింది. సోమవారం రాత్రి 7 గంటలకు గరుడ వాహన సేవ ప్రారంభం కాగా.. సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామివారు గరుడునిపై కొలువుదీరి.. ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు.
పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాల్లోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజేస్తారని పండితులు తెలిపారు. అంతేగాక జ్ఞాన వైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటి విశ్వాసమని పేర్కొన్నారు. వాహన సేవలో సుప్రీంకోర్టు రిటైర్డ్ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, తిరుమల చిన జీయర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో లోకనాథం తదితరులు పాల్గొన్నారు.