Posani attacks Pawan Kalyan | జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ ప్రీరిలీజ్ వేడుకసభలో వాడిన భాష అభ్యంతరకరంగా ఉందని సినీ నటుడు, వైసీసీ నేత పోసాని కృష్ణ మురళి పేర్కొన్నారు. వైసీపీ సర్కార్లో అక్రమాలు, అన్యాయాలు జరుగుతున్నాయని పవన్ కల్యాణ్ ప్రశ్నిస్తే తప్పులేదని, కానీ అందుకు సాక్షాలు చూపాలని సోమవారం మీడియాతో చెప్పారు. పవన్ కల్యాణ్ చెప్పినట్లు అన్యాయాలు, అక్రమాలు జరిగినట్లు నిజమని నిరూపిస్తే నమస్కారం పెట్టి, ఆయన జనసేనకే సేవ చేస్తామని వ్యాఖ్యానించారు.
మెగాస్టార్ చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు కూడా విపక్ష నేతలను అసభ్య పదజాలంలో అవమానించడం మీరెప్పుడైనా చూశారా.. ఎవరిని ప్రేరణగా తీసుకుని దూషిస్తున్నారు.. ప్రజల్లో ఒకడిగా తాను ఆ విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జగన్ అంటే తనకు అభిమానం, తాను చనిపోయే వరకు ఆ అభిమానం అలాగే కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఆయన తప్పు చేస్తే ప్రశ్నించే హక్కు తనకుందని, కానీ ఆయన అలాంటి వ్యక్తి కాదని నమ్ముతున్నానని చెప్పారు.
రోడ్డు ప్రమాదంలో సాయిధరమ్ తేజ్ గాయపడటంతో పవన్ కల్యాణ్.. రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్కు వచ్చారని పోసాని మురళి గుర్తు చేశారు. సినిమా ప్రీ రిలీజ్కు వచ్చినప్పుడు దాని గురించి, సాయిధరమ్ తేజ్ గురించి మాట్లాడాలని హితవు చెప్పారు. కానీ ఆ వేడుకలో ఏపీ సీఎం వైఎస్ జగన్ను, మంత్రులు, ఎమ్మెల్యేలను ఇష్టం ఉన్నట్లు, నోటికొచ్చినట్లు తిట్టడం సరి కాదని తేల్చి చెప్పారు.