అమరావతి : పొలానికి వెళ్తూ ప్రమాదవశాత్తు జారి వ్యవసాయబావిలో పడిన వృద్ధురాలు సమయస్ఫూర్తితో చాకచక్యంగా పైపులు పట్టుకొని ప్రాణాలు దక్కించుకుంది. వృద్ధురాలి కేకలు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని ఆమెను రక్షించారు.
ఆంధ్రప్రదేశ్లోని చిత్తూర్ జల్లా రేణిగుంట మండలం అత్తూరు గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన వృద్దురాలు సుబ్బమ్మ (80) పొలానికి వెళ్తూ కాలుజారి వ్యవసాయ బావిలో పడింది. వెంటనే తేరుకొని మోటర్ పైపులను పట్టుకుని కేకలు వేసింది.
సమీపంలోని వారు గుర్తించి గాజులమండ్యం పోలీసులకు సమాచారం అందించారు. కానిస్టేబుళ్లు మహేశ్, శివకుమార్ నిమిషాల్లో ఘటనాస్థలానికి చేరుకొని మంచాన్ని బావిలోకి దింపి ఆమెను రక్షించారు.
80 ఏండ్ల వయసులోనూ ఎంతో సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రాణాలు దక్కించుకున్న సుబ్బమ్మను స్థానికులు, పోలీసులు అభినందిస్తున్నారు. కానిస్టేబుళ్లకు తిరుపతి ఎస్పీ అప్పలనాయుడు రివార్డులు ప్రకటించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.