అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ప్రజలు దీవిస్తుంటే చంద్రబాబు ఓర్వలేక పోతున్నారని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. పరిషత్ ఎన్నికల్లో వైసీపీ 99 శాతం జడ్పీటీసీ, 85 శాతం ఎంపీటీసీలు గెలిచినట్లు మంత్రి కొడాలి నాని తెలిపారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండగా చంద్రబాబు, కుట్రలు పన్ని అప్పటి ఎన్నికల కమిషనర్తో వాయిదా వేయించి పారిపోయారని ఎద్దేవా చేశారు.
కొత్త ఎన్నికల కమిషనర్ వచ్చాక మార్చిలో ఎన్నికల ప్రక్రియ కొనసాగిస్తే.. టీడీపీకి భంగపాటు తప్పదని తెలిసి లెక్కింపు ఆపేశారని విమర్శలు గుప్పించారు. 800 మంది టీడీపీ అభ్యర్థులు గెలిచారని.. వాళ్లందరూ చంద్రబాబుని ధిక్కరించినవాళ్లా? అని సూటిగా ప్రశ్నించారు. ఆ గెలిచిన వాళ్లలో ఒకరిని పార్టీ అధ్యక్షుడిగా పెట్టుకోండి అని సూచించారు. ప్రతిపక్షం ఉనికి కోల్పోయిందని చంద్రబాబు ఒప్పుకుంటున్నారని మంత్రి పేర్కొన్నారు.