తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో మూడురోజులపాటు శాస్త్రోక్తంగా జరిగిన పవిత్రోత్సవాలు సాయంత్రం పూర్ణాహుతితో ముగిశాయి. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు యాగశాలలో ఋత్వికులు హోమాలు నిర్వహించారు. 9 గంటల నుంచి 11 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం చేపట్టారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపుతో అభిషేకించి చివరగా చందనం పూత పూశారు. ధూపదీప హారతులు నివేదించారు.
సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు కటాక్షించారు. 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు యాగశాలలో పూర్ణాహుతి నిర్వహించారు. ఆ తరువాత శ్రీమలయ్పప్పస్వామివారు శ్రీదేవి, భూదేవితో విమాన ప్రదక్షిణంగా వెళ్లి ఆలయ ప్రవేశం చేయడంతో పవిత్రోత్సవాలు ముగిశాయి. కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్స్వామి, అదనపు ఈఓ ఏవీ ధర్మారెడ్డి, ఆలయ డిప్యూటీ ఈఓ రమేష్ బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.