శ్రీశైలం : ప్లవ నామ సంవత్సరం అందరిలోనూ సుఖసంతోషాలను ఆయురారోగ్యాలను నింపాలని ఆకాంక్షిస్తూ శ్రీశైలం ఆలయ ఈఓ కేఎస్ రామారావు దేవస్థాన పంచాగాన్ని ఆవిష్కరించారు.
మంగళవారం ఉదయం అలంకార మండపంలో పంచాగానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి శ్రీపండిత బుట్టే వీరభద్ర పంచాంగ శ్రవణం చేశారు.
‘‘ప్లవ నామ సంవత్సరంలో రోగ పీడిత కారకాలు నాశనమై సకాలంలో వర్షాలు కురిసి
రైతాంగం సుభిక్షంగా ఉంటుంది. యువత అన్ని రంగాల్లో ముందుంటారు. సింధూనది పుష్కరాలు కూడా వైభవంగా జరుగుతాయి’’ అని ఆయన తెలిపారు.
అనంతరం ఆస్థాన సిద్ధాంతి వీరభద్ర దైవజ్ఞ ఉభయ దేవాలయాల ప్రధాన అర్చకులు, స్థానాచార్యులు, ఉప ప్రధాన అర్చకులు, వేదపండితులకు వేదాశీర్వచనాలు చేసి శేషవస్త్రాలు, ప్లవనామ పంచాంగం, తీర్థప్రసాదాలు ఇచ్చి ఉగాది పురస్కారాలు అందజేశారు.
కొవిడ్ నేపథ్యంలో భక్తుల కోరిక మేరకు దేవస్థానం పరోక్ష సేవలను ప్రారంభించి నేటికి ఏడాది పూర్తయ్యిందని ఈఓ కేఎస్ రామారావు అన్నారు.
పరోక్ష సేవలో భాగంగా భక్తులు క్షేత్రానికి రాకుండా స్వామిఅమ్మవార్లకు నిత్యం జరిగే 10 సేవలలో తమ గోత్రనామాలతో అర్చనలు, హోమాలు చేసుకునే వెసులుబాటు కల్పించారు.
ఈ సంవత్సర కాలంలో 19,862 మంది భక్తులు పాల్గొన్నారు. ఆలయానికి రూ. 2,23,29,059 విరాళంగా వచ్చింది.
పరోక్ష సేవలకు సహకరించిన అర్చక వేద పండితులు, ఆలయ సిబ్బంది, అధికారులు, శ్రీశైల టీవీ ఛానల్తోపాటు దేశవిదేశాల్లోని సేవాకర్తలను ఈఓ అభినందించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి