ఏపీ సర్కారుకు ఓయూ జేఏసీ హెచ్చరిక
హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలాలను బేసిన్ అవతలి ప్రాంతాలకు అక్రమంగా తరలించేందుకు చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే ఆపకపోతే, లక్ష మందితో పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీని కూల్చేస్తామని ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ హెచ్చరించింది. ‘కృష్ణా, గోదావరి జలాలు- కేంద్రం ఆధిపత్యం’ అనే అంశంపై ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్క్లబ్లో శుక్రవారం రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓయూ జేఏసీ అధ్యక్షుడు దత్తాత్రేయ మాట్లాడుతూ.. కృష్ణాజలాల పేరిట తెలంగాణపై తిరిగి ఆంధ్ర పెత్తనాన్ని చెలాయించాలని చూస్తే సహించబోమని హెచ్చరించారు. బచావత్ ట్రిబ్యునల్ తేల్చిన నీటి వాటా తాత్కాలికమైనదేనని, దానిని హక్కుగా చూపి బేసిన్ అవతలి ప్రాంతాలకు జలాలను దోచుకెళ్తున్నదని 1969నాటి ఉద్యమకారుడు ప్రొఫెసర్ వినాయక్రెడ్డి, నైనాల గోవర్ధన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ ప్రభుత్వం కృష్ణా, గోదావరి జలాలపై కొత్త నిబంధనలు తెచ్చి, రాష్ర్టాలపై అజమాయిషీ చెలాయించాలని చూస్తున్నదని, దానిని అంగీకరించబోమని తెలంగాణ స్టూడెంట్ జేఏసీ చైర్మన్ మాందాల భాస్కర్ పేర్కొన్నారు. కృష్ణా పరివాహక ప్రాంతంలో ఆంధ్ర ప్రాజెక్టులన్నీ అక్రమమేనని తెలంగాణ ఇంజినీర్స్ జేఏసీ చైర్మన్ తన్నీరు వెంకటేశ్ విమర్శించారు. సమావేశంలో ఇంజినీర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చైర్మన్ డాక్టర్ రమణనాయక్, ఓయూ జేఏసీ నేత లు రవీందర్నాయక్, అశోక్యాదవ్, హబీ మ్ ఖాద్రీ, గడ్డం శ్రీనివాస్, చిరంజీవి బెస్త, అర్జున్, పల్లె రవి తదితరులు పాల్గొన్నారు.