తిరుమల,మే 1:పూర్వం తిరుమల శ్రీవారికి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన బియ్యం ఇతర ఉత్పత్తులతో నైవేద్యంపెట్టేవాళ్లు.ఈరోజు నుంచి ప్రయోగాత్మకంగా అదే విధానాన్ని అనుసరిస్తున్నారు తిరుమల అర్చకులు. కృష్ణా జిల్లా పినగూడురులంకకు చెందిన రైతు శ్రీ విజయరామ్ సహకారంతో ఈ ప్రక్రియను కొనసాగిస్తామన్నారు. మొదటి దశలో శ్రీవారి నైవేద్యానికి ఉపయోగించే అన్నప్రసాదాల తయారీ, రెండో దశలో శ్రీవారి లడ్డూ, వడ ప్రసాదాల తయారీ, మూడో దశలో వెంగమాంబ అన్నప్రసాద భవనంలో భక్తులకు అందించే అన్నప్రసాదాల తయారీ చేపట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు.
ఇందుకోసం తెలుగు రాష్ట్రాల్లోని రైతులను భాగస్వాములను చేస్తామని, ప్రకృతి వ్యవసాయం ద్వారా దేశీయ బియ్యం రకాలను పండించడంలో శిక్షణ ఇస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. శ్రీవారికి భక్తులు కానుకగా అందించిన వ్యవసాయ భూముల్లోనూ రైతుల సహకారంతో ప్రకృతి వ్యవసాయం చేసేందుకు చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. ఇవాళ్టి నుంచి శ్రీవారికి 365 రోజుల పాటు 365 రకాల దేశీయ వరి వంగడాల బియ్యంతో నైవేద్యం సమర్పించనున్నారు.