మారేడ్పల్లి, జూలై 27: రెండు ఆర్టీసీ బస్సుల మధ్య నలిగి ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఈ సంఘటన గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సికింద్రాబాద్ రెతిఫైల్ బస్టాండ్లో దుర్గాప్రసాద్ (73) ఆదివారం మధ్యాహ్నం 12:45 గంటలకు 20పీ ఆర్టీసీ బస్సు దిగాడు. ఇతడు దిగిన బస్సు ముందు భాగంలో సికింద్రాబాద్ నుంచి దిల్సుఖ్నగర్ వెళ్లే ( ఏపీ11జడ్ 7412) ఆర్టీసీ బస్సు ఆగి ఉంది. దుర్గా ప్రసాద్ రెండు బస్సుల మధ్య నుంచి దాటుతున్నాడు. అదే సమయంలో దిల్సుఖ్నగర్ వెళ్లే బస్సు డ్రైవర్ బస్సును వెనక్కి తీశాడు. దీంతో రెండు బస్సుల మధ్యలో వృద్ధుడు నలిగిపోయాడు. తీవ్ర గాయాలైన దుర్గాప్రసాద్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.