హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్ జిల్లా వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబుపై నమోదైన కేసులో ఆయనకు నోటీసులు ఇచ్చే అంశంపై సస్పెన్షన్ కొనసాగుతున్నది. చంద్రబాబుకు నోటీసులు ఇచ్చేందుకు ఉదయం కర్నూల్ నుంచి హైదరాబాద్కు బయల్దేరిన పోలీసులకు నగరానికి చేరేలోపే నోటీసులు ఇవ్వవద్దంటూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
దీంతో తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ కర్నూల్ పోలీసులు ఎదురు చూస్తున్నట్లు తెలుస్తున్నది. చంద్రబాబుకు నోటీసులు జారీ చేసేందుకు పోలీసులు న్యాయ సలహాలు తీసుకుంటున్నారు. స్పీకర్ ద్వారా ఆయనకు నోటీసులు అందించాలని న్యాయ నిపుణులు సలహా ఇచ్చినట్లు వినికిడి.
నోటీసుల జారీ విషయంలో న్యాయ నిపుణుల సూచనలను పోలీసులు పరిశీలిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా మ్యుటేషన్ ఎన్440కే వైరస్ ఉందంటూ చంద్రబాబు ప్రజలను భ్రయబ్రాంతులకు గురిచేశారని ఆయనపై న్యాయవాది సుబ్బయ్య కర్నూల్ వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయనపై ఐపీసీ 155, 505(1)(బీ)(2) సెక్షన్లతోపాటు 2005 ప్రకృతి వైపరీత్యాల చట్టం సెక్షన్-4 కింద కేసు నమోదు చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.