తాండూరు, మే 3 : ‘కరోనా బాధితులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలి.. వైద్యులు షిఫ్టుల వారీగా సేవలను అందించండి’ అని వికారాబాద్ కలెక్టర్ పౌసుమి బసు అన్నారు. సోమవారం తాండూరు రాజీవ్ కాలనీ సమీపంలోని మాతాశిశు దవాఖానలోని ఐసోలేషన్ కేంద్రం, కొవిడ్ పరీక్షలు, వ్యాక్సిన్ సెంటర్లను అదనపు కలెక్టర్ చంద్రయ్య, ప్రత్యేకాధికారి హన్మంతరావుతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సర్కారు దవాఖానలో మెరుగైన సేవలు అందుతున్నాయన్నారు. జిల్లా దవాఖానలో 100 పడకలకు కావాల్సిన సకల సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. దవాఖానలో 24 ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటు చేయాలని తెలిపారు. అవసరం మేరకు ఆక్సిజన్ సిలిండర్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. జిల్లా దవాఖాన, ఐసోలేషన్ కేంద్రంలో అవసరమైన సిబ్బంది ఉండేలా చూడాలన్నారు. విద్యుత్ కోసం జనరేటర్, నీటి సౌకర్యం, శానిటైజర్ తదితర సౌకర్యాలు ఉండేలా చూడాలని సంబంధిత అధికారులకు తెలిపారు.అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు.