తిరుమల : శ్రావణ ఉపకర్మ పర్వదినం సందర్భంగా శ్రీవారి ఆలయంలోని శ్రీకృష్ణస్వామివారికి ఆదివారం నూతన యజ్ఞోపవీతాన్ని సమర్పించారు. శ్రావణ పౌర్ణమినాడు ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్య ఈ కార్యక్రమం జరిగింది. శ్రీవారి ఆలయంలోని శ్రీకృష్ణస్వామివారి ఉత్సవమూర్తిని శ్రీవరాహ స్వామి ఆలయం ఎదుట ఉన్న స్వామి పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి నూతన యజ్ఞోపవీతం (పవిత్రమైన దారం) ధరింపజేశారు. అనంతరం శ్రీవారి ఆలయానికి వెంచేపు చేశారు.