తిరుమల, 9, మే: కరోనా వ్యాధిని మానవాళికి దూరం చేయాలని శ్రీవారిని ప్రార్థిస్తూ టీటీడీ నిర్వహిస్తున్న వైదిక, ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రపంచ మానవాళి సంక్షేమం కోసం నక్షత్రసత్ర మహాయాగం నిర్వహిస్తున్నట్టు ధర్మగిరి వేదవిజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ కెఎస్ఎస్ అవధాని తెలిపారు. జూన్ 15వ తేదీ వరకు జరుగనున్న ఈ మహాయాగం ప్రారంభ కార్యక్రమం ఆదివారం ధర్మగిరి వేద పాఠశాలలో జరిగింది.
ఈ సందర్భంగా అవధాని మాట్లాడుతూ మే 9, 10, 11వ తేదీల్లో పూర్వాంగభూతములైన శ్రౌతయాగాలు నిర్వహిస్తామని తెలిపారు. మే 12 నుండి కృత్తికా నక్షత్రం నుంచి భరణి నక్షత్రం వరకు అభిజిత్ నక్షత్రం సహా 28 నక్షత్రాల అధిష్టాన దేవతలకు శ్రౌతయాగాలు నిర్వహిస్తామని వివరించారు. ఆ తరువాత చంద్రుడు, అహోరాత్రములు, ఉషఃకాలం, నక్షత్ర సామాన్యము, సూర్య భగవానుడు, దేవమాత అయిన అదితి, యజ్ఞ స్వరూపుడైన విష్ణువుకు శ్రౌతయాగాలు నిర్వహిస్తామన్నారు
. ప్రపంచంలోని ప్రజలందరూ 27 నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రంలో జన్మించి ఉంటారని, ఈ యాగాల ద్వారా ఆయా అధిష్టాన దేవతలు తృప్తి చెంది విశేషమైన ఫలితాలను అనుగ్రహిస్తారని చెప్పారు. వైశాఖ శుద్ధ పాడ్యమి నాడు రోహిణి సంధితో కూడిన కృత్తికా నక్షత్రం రావడం అరుదని, ఈ సందర్భంలో మాత్రమే ఈ యాగాలు నిర్వహిస్తారని తెలియజేశారు. కాగా, ఆదివారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విచ్ఛిన్నాధానం, అగ్నిహోత్రం, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు అగ్నిహోత్రం యాగ కార్యక్రమాలు నిర్వహించారు.