అమరావతి : ఏపీలో రేపు మున్సిపల్ ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్నిఏర్పాట్లు చేశారు. ఉదయం 8 నుంచి లెక్కింపు ప్రక్రియ ప్రారంభంకానుంది. 11 నగరపాలికలు,70 పురపాలికల్లో ఆదివారం ఓట్ల లెక్కింపు జరుగనుంది. 71 పురపాలికల్లో ఎన్నికలు జరిగినప్పటికి హైకోర్టు ఉత్తర్వుల కారణంగా ఏలూరు నగరపాలికలో ఓట్ల లెక్కింపును ఈసీ నిలిపివేసింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. నగరపాలికల్లో ఓట్ల లెక్కింపు కోసం 2,204 టేబుళ్లు, పురపాలికలు, నగర పంచాయతీల్లో 1,822 టేబుళ్లను మొత్తం 4,026 టేబుళ్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
నగరపాలికల్లో ఓట్ల లెక్కింపు పర్యవేక్షణకు 2,376 మంది సూపర్వైజర్లను, 7,412 మంది లెక్కింపు సిబ్బందిని నియమించారు. పురపాలికల్లో 1,941 మంది సూపర్వైజర్లను.. 5,195 మంది లెక్కింపు సిబ్బందిని వినియోగిస్తున్నట్లు ఎస్ఈసీ వెల్లడించింది. లెక్కింపు కేంద్రాల వద్ద 20,419 పోలీసు సిబ్బంది భద్రతను పర్యవేక్షిస్తారని పేర్కొంది. 1,134 మంది ఇతర భద్రతా సిబ్బందిని నియమించినట్లు తెలిపింది.