అమరావతి : విద్వేషాలు రెచ్చగొట్టి, ప్రజల మధ్య సామరస్యాన్ని ఎలా దెబ్బతీయాలనే కాలం చెల్లిన వ్యూహాలకే చంద్రబాబు నాయుడు పదును పెడుతున్నాడని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. టీడీపీ మహానాడుపై ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. రంగు వెలిసిన పార్టీలో ఉత్తేజం నింపాలంటే కార్యకర్తలకు స్పూర్తిదాయకమైన కార్యాచరణను ఇవ్వాలన్నారు. ప్రజలతో మమేకమై వారి అభిమానం చూరగొనాలని చెప్పాలన్నారు. బాబు మాత్రం ఏ కులాన్ని ఎలా మేనేజ్ చేయాలనే చూస్తున్నట్లు తెలిపారు.
బాబు జూమ్ మహానాడు ఊసుపోక అందరితో తిట్టించుకునేందుకు పెట్టినట్టే ఉందని పేర్కొన్నారు. తను చక్రం తిప్పినన్ని రోజులు పట్టించుకోకుండా ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని ఇప్పుడు తీర్మానం చేయడం ఏంటని ప్రజలు నిలదీస్తున్నారు. బీజేపీతో కలిసి పనిచేయాలన్న ఆలోచనను కమలం పార్టీ నేతలు తూర్పార పట్టారన్నారు.