అమరావతి : పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీని సీఐడీ పోలీసులు గుంటూరు జిల్లా కేంద్ర జైలుకు తరలించారు. రఘురామ తరలింపు నేపథ్యంలో జైలు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వైద్య పరీక్షలు ముగిసిన వెంటనే ఆయనను గుంటూరు గవర్నమెంట్ జనరల్ దవాఖాన నుంచి నేరుగా జిల్లా కేంద్ర జైలుకు తీసుకెళ్లారు. నిన్న రఘురామకు సీఐడీ ప్రత్యేక కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. మరో వైపు కోర్టుకు సమర్పించాల్సిన మెడికల్ బోర్డు నివేదికలో జాప్యం జరుగుతుండటంతో రఘురామకృష్ణరాజు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గుంటూర్ సీఐడీ కార్యాలయంలో పోలీసులు తనను కొట్టారని నిన్న రఘురామ సీఐడీ కోర్టు న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. ఎంపీ తరఫు న్యాయవాదులు ఇదే విషయాన్ని హైకోర్టుకు నివేదించారు. ఈ క్రమంలో రఘురామకు పరీక్షలు నిర్వహించి మెడికల్ బోర్డు నివేదిక అందజేయాలని జిల్లా కోర్టు, హైకోర్టు డివిజన్ బెంచ్ కోరింది. పరీక్షలు పూర్తికావడంతో హైకోర్టుకు నివేదిక అందించేందుకు మెడికల్ బోర్డు కమిటీ సభ్యులు సన్నద్ధమవుతున్నారు. మరికాసేపట్లో మెడికల్ బోర్డు నివేదిక హైకోర్టుకు చేరే అవకాశం ఉంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.