అమరావతి : జడ్జి రామకృష్ణను పీలేరు జైలు నుంచి దవాఖానకు తరలించేలా చొరవ తీసుకోవాలని కోరుతూ నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు లేఖ రాశారు. జడ్జి రామకృష్ణ మధుమేహంతో బాధపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. చికిత్స నిమిత్తం తిరుపతిలో వసతులున్న దవాఖానకు తరలించేలా చూడాలని విన్నవించారు. జడ్జి రామకృష్ణకు వైద్య చికిత్స ఆలస్యమైతే ఇబ్బందులు తలెత్తే అవకాశముందని, రాజ్యాంగ అధినేతగా పౌరుల హక్కులు పరిరక్షించాలని గవర్నర్ను ఎంపీ రఘురామ కోరారు.
జడ్జి రామకృష్ణ కుమారుడి వినతి మేరకు తాను లేఖ రాస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై రాజద్రోహం కేసులో అరస్టయిన రామకృష్ణను ఇటీవల చిత్తూరు జైలు నుంచి పీలేరు సబ్ జైలుకు తరలించారు. ఈ మేరకు రామకృష్ణ కుమారుడు వంశీ కృష్ణకు జైలు అధికారులు సమాచారం అందించారు. చిత్తూరు జిల్లాలో జైల్లో ఉన్న తన తండ్రికి ప్రాణహాని ఉందంటూ వంశీ కృష్ణ రెండురోజుల క్రితం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. దీంతో హైకోర్టు ఆదేశాల మేరకు జడ్జి రామకృష్ణను చిత్తూరు జిల్లా జైలు నుంచి పీలేరు సబ్ జైలుకు తరలించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.