అమరావతి : వైసీపీ రెబల్ ఎంపీ రఘరామకృష్ణరాజుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేసు దర్యాప్తునకు ఆయన సహకరించాలని పేర్కొంది. పిటిషనర్ మీడియా, సామాజిక మాధ్యమాల్లో మాట్లాడకూడదంది. కనీసం ఒకరోజు ముందు దర్యాప్తు అధికారులు పిటిషనర్కు సమాచారం ఇవ్వాలని సూచించింది. న్యాయవాది సమక్షంలో దర్యాప్తు అధికారి ఎదుట హాజరుకావొచ్చని తెలిపింది. దేశద్రోహం కేసులో వైసీపీ నర్సాపురం ఎంపీని సీఐడీ పోలీసులు వారం రోజులక్రితం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తనను సీఐడీ పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని పేర్కొంటూ బెయిల్ కోరుతూ ఎంపీ నేరుగా సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీం ఆదేశానుసారం రాఘురామకృష్ణరాజుని ఆర్మీ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆర్మీ ఆస్పత్రి నివేదిక అనంతరం బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీం రఘురామకృష్ణరాజుకు బెయిల్ను మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. ఎంపీ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా బెయిల్ మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది.