అమరావతి : చిన్నారితో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలో ఇవాళ ఈ విషాద ఘటన జరిగింది. కేశవరాయునిపాలెం గ్రామానికి చెందిన వాలంటీర్ రాజేశ్వరీ (27) మధ్యాహ్నం తన ఏడాదిన్నర కూతురుతో గ్రామశివారులోని వ్యవసాయబావిలో దూకింది. గుర్తించిన స్థానికులు తల్లీకూతురును బావి నుంచి బయటకు తీసి చికిత్స నిమిత్తం తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయారు. అత్తింటి వేధింపుల కారణంగానే రాజేశ్వరీ ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. మృతురాలు 7 నెలల గర్భిణి అని కుటుంబ సభ్యులు తెలిపారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.