విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో విషాదం చోటుచేసుకుంది. అరకులోయలో ముగ్గురు చిన్నారులు సహా తల్లి అనుమానస్పద స్థితిలో మృతిచెందింది. పిల్లలకు పురుగుమందు తాగించిన తల్లి, అనంతరం తాను కూడా ఉరేసుకుని మృతిచెందింది. అరకులోయలో మండలం సిమిలిగూడకు చెందిన సురేఖ, శెట్టి సంజీవ్ భార్యా భర్తలు. వారికి కూతురు సుశాన, ఇద్దరు కుమారులు షర్విన్, సిరిల్ ఉన్నారు. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి సురేఖ ఇంట్లో ఉరికి వేలాడుతున్న స్థితిలో స్థానికులు గుర్తించారు. అదేవిధంగా మంచంపై విగత జీవులుగా పడి ఉన్న పిల్లలను దవాఖానకు తరలించారు. అయితే అప్పటికే ముగ్గురు చిన్నారులు మృతిచెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.