అమరావతి : పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు నేడు హైదరాబాద్లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. సికింద్రాబాద్ ఆర్మీ హాస్పటల్లో ఆయనకు సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్రత్యేక మెడికల్ బోర్డు, న్యాయాధికారి సమక్షంలో వైద్యులు వైద్య పరీక్షలు చేయనున్నారు. అత్యున్నత న్యాయంస్థానం ఆదేశాల మేరకు ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ఈ ప్రక్రియ పర్యవేక్షణకు ప్రత్యేక న్యాయాధికారిని నియమించింది.
ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ముగ్గురు వైద్యులతో కూడిన బృందం ఎంపీ రఘురామకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిసింది. వైద్య పరీక్షల నిర్వహణ ప్రక్రియను వీడియో రికార్డు చేయాలని, పరీక్షల అనంతరం వైద్య నివేదికను సీల్డ్కవర్లో సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. కోర్టు తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఎంపీ రఘురామ సికింద్రాబాద్ ఆర్మీ హాస్పటల్లోనే ఉండనున్నారు.
రఘురామకృష్ణం రాజు బెయిల్ పిటిషన్తోపాటు ప్రైవేట్ దవాఖానలో వైద్య పరీక్షల నిర్వహించిన అంశంపై సుప్రీంకోర్టులో సోమవారం వాదనలు జరిగాయి. రఘురామకృష్ణరాజు తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గి, ఆదినారాయణరావు, ఏపీ ప్రభుత్వం తరఫున దుష్యంత్ దవే, వీవీ గిరి వాదనలు వినిపించారు.
బెయిల్ మంజూరుతోపాటు ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం అందించేందుకు రఘురామకు అవకాశం కల్పించాలని రోహత్గి కోర్టును కోరారు. ఎంపీని అరెస్ట్ చేసిన తీరును, ఆతర్వాత జరిగిన పరిణామాలను న్యాయస్థానానికి వివరించడంతో.. సికింద్రాబాద్ ఆర్మీ దవాఖాలో రఘురామకృష్ణరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.