విజయవాడ : ఆంధ్రా-ఒరిస్సా స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడు ముత్తన్నగిరి జలంధర్ రెడ్డి అలియాస్ మారన్నా(40) పోలీసులకు లొంగిపోయినట్లు ఏపీ డీజీపీ గౌతమ్ సావాంగ్ తెలిపారు. డీజీపీ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. పలు పోలీస్ స్టేషన్లపై దాడులకు పాల్పడిన మారన్న తలపై రూ.20 లక్షల రివార్డు ఉందన్నాడు. మారన్న తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలోని కోపల్లికి చెందిన వ్యక్తి అని తెలిపారు. ఏవోబీలో అనేక దాడులకు పాల్పడటంతో పాటు 2008 బలిమెలా సంఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్నాడు. ఆరు హత్య కేసుల్లో నిందితుడు. పార్టీకి ప్రజల మద్దతు లేనందున మారన్న ప్రధాన స్రవంతిలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సావాంగ్ పేర్కొన్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు అందించే అన్ని సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం మరన్నకు వర్తింపజేస్తుందని డీజీపీ ఈ సందర్భంగా తెలిపారు.