రామన్నపేట, జూన్7: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం మండలంలోని నీర్నెంముల, పల్లివాడ, ఉత్తటూరు గ్రామాల్లో రూ. 5లక్షలతో ఏర్పాటు చేయనున్న సీసీ రోడ్లు, సూరారం గ్రామంలో రూ. 5 లక్షలతో చేపట్టనున్న సీసీరోడ్డుతోపాటు మరో రూ.5లక్షలతో నిర్మించనున్న పాఠశాల తరగతి గదుల పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ కొవిడ్ లాక్డౌన్ కా రణంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడిన రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని కొనియాడారు. పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామా ల్లో వైకుంఠధామాలు, పల్లెప్రకృతివనాలు, డంపింగ్యార్డులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మండలకేంద్రంతోపాటు ఇంద్రపాలనగరం, మునిపంపులలో నిర్మించిన రైతువేదికలను రెండు, మూడు రోజుల్లో ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు అవసరమని అన్నారు. సూరారంలో స్థానిక పంటలపై రైతులతో ఆయన చర్చించారు. గ్రామంలో కృష్ణబాబు అనే రైతు 8 ఎకరాల్లో చేపడుతున్న చేపల పెంపకాన్ని పరిశీలించారు. ప్రస్తుతం గ్రామంలో సాగునీరు సమృద్ధిగా ఉన్నందున రైతులు చేపల పెంపకంపై దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జ్యోతీబలరాం, సర్పంచ్లు సుజాతారవి, సంధ్యస్వామి, కిషన్, అండాలు, సతీశ్, సుధీర్బాబు, పారిజాత, శ్రీనివాస్, నరేందర్ పాల్గొన్నారు.