అమరావతి: ఏపీలో జరిగిన స్థానిక సంస్థల ఫలితాల్లో అధికార పార్టీ వైసీపీ జోరు కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో జగన్ పార్టీ జెండా ఎగిరింది. కాగా టీడీపీ ప్రతిపక్ష హోదాలో ఉండి ఎన్నికలను బహిష్కరించింది. అయినప్పటికీ కొన్ని చోట్ల టీడీపీ అభ్యర్థులు పోటీలో నిలిచారు. మొత్తం 206 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టగా.. ఇప్పటివరకూ వెలువడిన ఫలితాల్లో అధికార వైసీపీ ఇప్పటివరకూ పూర్తి ఆధిపత్యం కనబర్చింది.
శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 678 ఎంపీటీసీ స్థానాలుండగా.. 66 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 590 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా.. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో వైసీపీ 376, టీడీపీ 49, స్వతంత్రులు 4 స్థానాల్లో విజయం సాధించారు. విజయనగరం జిల్లాలో 549 ఎంపీటీసీ స్థానాల్లో 55 ఏకగ్రీవమయ్యాయి. కాగా 487 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల ప్రకారం.. వైసీపీ 389, టీడీపీ 86చోట్ల గెలుపొందాయి. విశాఖ జిల్లాలో 652 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 37 ఏకగ్రీవమయ్యాయి. మిగతా 612 స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. ఇప్పటివరకు వైసీపీ 337, టీడీపీ 82, బీజేపీ 4, స్వతంత్రులు 20 స్థానాల్లో జయకేతనం ఎగురవేశారు.