హెచ్ఆర్ హెడ్ కూడా రాజీనామా
ముంబై, జూలై 10: ఐపీవోకు సిద్ధమవుతున్న తరుణంలో పేటీఎం నుంచి కీలక ఎగ్జిక్యూటివ్లు వైదొలిగారు. పేటీఎం ఫైనాన్షియల్ సర్వీసుల విభాగానికి నేతృత్వం వహిస్తున్న ప్రెసిడెంట్ అమిత్ నయ్యర్ తన పదవికి రాజీనామా చేశారు. అలాగే కంపెనీ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ రోహిత్ ఠాకూర్ కూడా తప్పుకున్నారు. పేటీఎం వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) సోమవారం జరగనున్న క్రమంలో వీరు రాజీనామా చేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. కాగా, వ్యక్తిగత రాజీనామాలపై స్పందించేందుకు పేటీఎం నిరాకరించింది. తాము అద్భుతమైన యాజమాన్య బృందాన్ని ఏర్పాటు చేశామని, కంపెనీ వృద్ధిపైనే దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు పేటీఎం వ్యాఖ్యానించింది. కంపెనీ ప్రతిపాదించిన తొలి పబ్లిక్ ఆఫర్కు ఈ ఏజీఎంలోనే షేర్హోల్డర్ల అనుమతి తీసుకోవాలని భావిస్తున్నది. ఏజీఎం అనుమతి లభించిన తర్వాత మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి ప్రాస్పెక్టస్ సమర్పించడానికి పేటీఎం సిద్ధమవుతున్నది. వాస్తవానికి ఐపీవోకు అవసరమైన సంస్థాగత మార్పుల్ని చేసిన తర్వాతనే అమిత్ నయ్యర్ కంపెనీ నుంచి వైదొలిగినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఐపీవో జారీద్వారా 2.3 బిలియన్ డాలర్ల నుంచి 2.4 బిలియన్ డాలర్ల నిధుల్ని (రూ.17,000-18,000 కోట్లు) సమీకరించాలని పేటీఎం ప్రయత్నిస్తున్నది.