అమరావతి: పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దాని ప్రభావంతో రాగల మూడు రోజులు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ, రేపు కోస్తాంధ్రాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. రాయలసీమలోనూ ఇదే రకమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయని, పలు ప్రాంతాలలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. మిగిలిన చోట్ల తేలికపాటి వర్షాలు పడతాయన్నారు.
అల్పపీడనం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పారు. సముద్రం అలజడిగా ఉంటుందని, తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు ఎవరూ మంగళవారం వరకు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీచేశారు.